
అమెరికా-ఇరాన్ యుద్ధం 16వ రోజుకు చేరింది
ఇరాన్ ‘కిరికిరి’.. అమెరికా ‘ఉక్కిరిబిక్కిరి’!
'హర్మోజ్ ను కాపాడుకుందాం, కలిసిరండని ఎంత చెప్పినా వినరేం' అంటూ డోనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే ఒక్క జలసంధి వైపు చూస్తోంది.. అదే హర్మోజ్ (Strait of Hormuz). ఇటు ఇరాన్ తన పట్టు బిగిస్తుంటే, అటు అమెరికా గగనతల దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం 16వ రోజుకు చేరింది. పరిస్థితి మరింత భీకరంగా మారింది. అమెరికా సైన్యం ఉన్న విమానాన్ని ఇరాక్ లో కూల్చివేశారు. ఆరుగురు అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇరాన్ పై బాంబుల వర్షం కురుస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇతర మిత్రదేశాలపై చెలరేగిపోయారు. హర్మోజ్ ను కాపాడుకుందాం, కలిసిరండి అని ఎంత చెప్పినా వినరేం అంటూ విరుచుకుపడ్డారు.
హర్మోజ్ ‘లాక్’.. ట్రంప్ సీరియస్!
ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మోజ్ జలసంధిని ఇరాన్ అడ్డుపెట్టుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. గల్ఫ్ చమురుపై ఆధారపడే దేశాలన్నీ కలిసి వచ్చి హర్మోజ్ జలసంధిని తెరిపించేందుకు సహకరించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం చెప్పానని, తన మాట వినాలని పిలుపిచ్చారు.
ఇరాన్ క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలను అమెరికా ఇప్పటికే ధ్వంసం చేసిందని, మరో రెండు రోజుల్లో వాటిని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుత యుద్ధ తంత్రం అంతా హర్మోజ్ జలసంధి చుట్టూతా తిరుగుతోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిలో ఆటంకాలు సృష్టించడం ద్వారా ప్రపంచ దేశాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనేది ఇరాన్ ప్రధాన ఎత్తుగడ కాగా, దానికి ప్రతిగా ఇరాన్ డ్రోన్, క్షిపణి తయారీ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి వారిని నిరాయుధులను చేయాలని అమెరికా వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు హర్మోజ్ మార్గంలో ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాలు యుద్ధాన్ని క్లిష్టతరం చేస్తుంటే, మరోవైపు గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
గగనతలంలో ‘కాపీ క్యాట్’ పిల్లుల పంజా!
‘కాపీ క్యాట్’ డ్రోన్లు ఇప్పుడు ఇరాన్ గగనతలంలో తిష్టవేశాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను వెతికి వేటాడే పనిలో పడ్డాయి. ఇరాన్ నావికా దళాన్ని ఇప్పటికే దెబ్బతీసినట్లు ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు వారి డ్రోన్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా దాడులు పెంచారు.
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధ క్షేత్రం: తాజా అప్డేట్స్
ఇరాన్లోని ఇస్ఫాహాన్ ప్రావిన్స్పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 15 మంది మరణించారు.
క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్లోని హోలోన్, ఐలాట్ వంటి నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఐలాట్లో క్లస్టర్ బాంబుల దాడి కలకలం రేపింది. పొరుగునే ఉన్న జోర్డాన్ వాసులు ఈ దాడులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రపంచానికి ఈ భీభత్సం తెలిసింది.
మొజ్తబా ఖమేనీ ఎక్కడ?: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బయట ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు కారణం.
ఇండిగో విమానాల నిలిపివేత- ఇండియన్ల ఇక్కట్లు...
ఈ యుద్ధ ప్రభావం సామాన్య ప్రయాణికులపై కూడా పడింది. మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత్కు చెందిన ఇండిగో (IndiGo) ఎయిర్లైన్స్ దుబాయ్ సర్వీసులను భారీగా తగ్గించింది.
దోహా, కువైట్, బహ్రెయిన్, దమ్మమ్, ఫుజైరా వంటి నగరాలకు మార్చి 28 వరకు విమానాలను రద్దు చేసింది. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది మంది భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు.
"ఇరాన్ శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తోందని ట్రంప్ అంటున్నా, అణ్వాయుధ ఆశలు వదులుకుంటేనే డీల్ సాధ్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. అప్పటి వరకు ఆకాశంలో ఈ 'కాపీ క్యాట్' పిల్లుల వేట, భూమిపై క్షిపణుల మోత తప్పేలా లేదు!"
Next Story

