
బస్తర్ కోసం యుద్ధం పార్ట్ 2: బహుముఖ వ్యూహంతో బస్తర్ లో పరిస్థితులు ఎలా తారుమారు అయ్యాయి?
పరిపాలనా-అభివృద్ధి శూన్యతను అధిగమించేందుకు “క్లియర్ అండ్ హోల్డ్” కోసం వ్యూహాత్మక విధానం —
5-భాగాల సిరీస్లోని ఈ రెండవది బస్తర్ను మావోయిస్టుల నుండి విడిపించే వ్యూహాన్ని సమగ్రంగా వివరిస్తుంది.
మావోయిస్టు తిరుగుబాటును “భారతదేశానికి అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు” అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించి,2010లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించిన తర్వాత, అత్యంత శక్తి వంతమైన బహుళ-స్థాయి జాతీయ భద్రతా ఏజెన్సీలు, రాష్ట్ర భద్రతా యంత్రాంగంతో కలిసి, కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర దశాబ్దంలో మావోయిస్ట్ ల కల్పిత “విముక్తి జోన్”ను వాస్తవంగా విముక్తి చేసినట్లు కనిపిస్తోంది.
CPI (మావోయిస్టులు) నేడు దాదాపుగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఆధిపత్య ప్రాంతాలు వేగంగా కుంచించుకుపోతున్నాయి. వారి రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. గత రెండు సంవత్సరాలలో పోలీసుల ముందు డజన్ల కొద్దీ కార్యకర్తలు లొంగిపోయారు . ఛత్తీస్గఢ్లోని బస్తర్, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఇతర రాష్ట్రాలలో కూడా భద్రతా బలగాల దాడిలో అనేక మంది సీనియర్ మావోయిస్టులు , కేంద్ర కమిటీ సభ్యులు మరణించారని, ఇటీవల లొంగిపోయిన అనేక మంది కార్యకర్తలు, పోలీసులు , నిఘా అధికారులు ,బస్తర్ ,గడ్చిరోలి ప్రాంతవాసులు ది ఫెడరల్ కు తెలిపారు.
వాస్తవంగా భద్రతా దళాలకు మొదట్లో అనేక భయానక పరిస్థితులు ఎదురయ్యాయి.వాటినుంచి పరివర్తన చెంది కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లినప్పటికీ మావోయిస్టు దాడులలో వందలాది మంది భద్రతా సిబ్బంది అశువులుబాశారు .అయితే గత మూడు సంవత్సరాలలో భద్రతా దళాలకు పరిస్థితులు అనుకూలంగా మారుతూ ,ఆపరేషన్లు కూడా నిర్ణయాత్మకంగా కొనసాగాయి.
అధిక వనరులు, సమన్వయం
మావోయిస్టుల అణచివేత విషయంలో రాజకీయంగా వచ్చిన నిర్ణయాత్మక మార్పు ఇప్పుడు భద్రతా దళాలలో పైస్థాయి నుంచి నుండి క్రింది స్థాయి వరకు జరుగుతున్న సంభాషణలలో భాగమవుతున్నాయి.అదే పోరులో ఉత్సాహాన్ని నింపుతోంది.
డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు గతంతో పోలిస్తే పటిష్టమైన వ్యూహాలు ,సమన్వయం కనిపిస్తోంది.దీనికితోడు మధ్య భారతదేశంలోని వామపక్ష తీవ్రవాదం (LWE) ప్రాంతాలలో భారీ ఖర్చులకు మించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనరులను పెంచుతున్నాయి.
భద్రతా యంత్రాంగంలో కొత్త నియామకాలు చేయడం, బహుముఖ శిక్షణ, నిఘా సేకరణ , దానిపై విశ్లేషణలను నిర్వహించడం,అధునాతన ఆయుధాలను సమకూర్చడం వంటివి ఈ వనరులలో భాగమయ్యాయి. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నమావోలకు, మావోల సమాచారం అందించే ఇన్ఫార్మర్ లకు భారీ ప్రోత్సాహకాలను అందించడం, మావో ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు , సౌకర్యాలను కల్పించడం వరకు ప్రభుత్వ చర్యలలో భాగమయ్యాయి.
రెండు, రాష్ట్రాల నక్సల్ వ్యతిరేక సంస్థలు, సాధారణ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ దళాలు ,ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం బాగా మెరుగుపడిందని ప్రస్తుత కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఒక ఉన్నత నిఘా అధికారి ది ఫెడరల్ కు తెలిపారు.
నిరాయుధులుగా చేయడంపై ప్రధాన దృష్టి
"ఉద్యమాన్ని,రెబల్స్ ను నిరాయుధులను చేయడమే మా ప్రధాన ఉద్ధేశ్యం" అంటూ తన పేరు ,హోదా వెల్లడించడానికి ఇష్టపడని అధికారి తెలిపారు.పిన్ పాయింట్ ఆపరేషన్ల ద్వారా సాయుధ మావో అగ్ర నేతలను హతమార్చడమే కాకుండా ,వారి ఆయుధాలను, ఆయుధ డంప్ లను స్వాధీనం చేసుకోవడం తమ ప్రధమ కర్తవ్యంగా తెలిపారు.మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయేలా వత్తిడి తేవడం కూడా భద్రతా దళాల ఆపరేషన్ లో ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 31, 2026 ను వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి గడువుగా నిర్ణయించారు.మధ్య భారతదేశంలోని అనేక లోయలు, అటవీ ప్రాంతాలు స్థావరంగా చేసుకున్న మావోల పూర్తి నిర్మూలనకు ,ఆ డెడ్ లైన్ కొంత వాస్తవ దూరం అనిపించినా, తిరుగుబాటుదారులు మళ్లీ పుంజుకోకుండా , ఊపిరి పీల్చుకోకుండా చేయడం మాత్రం అత్యవసరం.ఆ కార్యాచరణ లోనే భద్రత బలగాలు నిమగ్నమయయాయి.
మావోలకు తగ్గిన స్థానిక మద్దతు
బస్తర్ తో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , ఒడిశా లలో బలమైన మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త స్థావరాలను ఏర్పరుచుకోవడం మావోలకు కష్టంగా మారింది. మావోలకు స్థానిక ప్రజలు,గ్రామాల నుంచి మద్దతు తగ్గిపోయింది. ఇది గెరిల్లా వ్యూహాలకు ప్రతిబంధకంగా మారిందని, మావో కేడర్ల తాజా నియామకాలు దాదాపుగా తగ్గిపోయాయని లొంగిపోయిన మావో శ్రేణులు మా రిపోర్టర్లతో తెలిపాయి.. ప్రధానంగా, దిగువ , మధ్య స్థాయి సాయుధ కార్యకర్తలు చాలా మంది తమ పోరాటాన్ని విరమించుకుని పోలీసుల ముందు లొంగిపోవడానికి అదే కారణంగా కనిపిస్తుంది.
ఛత్తీస్గఢ్ నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఒక సీనియర్ అధికారి, పేరు వెల్లడించడానికి ఇష్టపడకుండా “సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని ముగించడానికి మార్చి 2026 గడువు మరింత విస్తృత లక్ష్యం. అప్పటికి అంతా అయిపోతుందని మేము ఎటువంటి భ్రమలో లేము. కాబట్టి అది జరిగే వరకూ మా గార్డులను నిరాశపరిచే అవకాశం లేదు” అన్నారు.
ఎన్నో రెట్లు పెరిగిన సెక్యూరిటి క్యాంపులు
బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ ది ఫెడరల్తో మాట్లాడుతూ , గత ఒకటిన్నర సంవత్సరాలలో మావోయిస్టుల కీలక ప్రాంతాలలో 20 కొత్త భద్రతా శిబిరాలు ప్రారంభించామన్నారు.. రోడ్ల నిర్మాణం, వైర్ ఫెన్సింగ్ వేయడం, లివింగ్ క్వార్టర్స్ , బ్యారక్ల నిర్మాణం, లోపల వార్ రూం ఏర్పాటుతో సహా శక్తివంతమైన భద్రతా క్యాంపును తెరవడానికి చాలా కృషి అవసరమన్నారు.
భద్రతా శిబిరాల సంఖ్య పెరగడం వల్ల బలగాలు త్వరితగతిన మావోలపై దాడి చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇటీవలి జరిగిన అన్ని ఆపరేషన్లు అలాంటివే, దానితోపాటు రెబల్స్ సమీపంలోని గ్రామంలో సమావేశాలు నిర్వహించడం కూడా ఈ క్యాంపుల వల్ల కష్టసాధ్యం అవుతుంది.ఒకసారి ఆ ప్రాంతంలో బలపడిన తర్వాత, భద్రతా శిబిరాలు పరిపాలనా మరియు అభివృద్ధి పనులకు కేంద్రంగా పనిచేస్తాయి. మొబైల్ టవర్ వస్తుంది, ఆ ప్రాంతవాసులకు ఈ క్యాంపుల ద్వారా ఆధార్ కార్డులు ఇవ్వవచ్చు, బ్యాంకు ఖాతాలు తెరవవచ్చు , గ్రామస్తుల ఇతర ప్రాథమిక సమస్యలను తీర్చవచ్చని తెలిపారు.
బహుముఖ వ్యూహం
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ పట్టిలింగం ఇలా వివరించారు. “దాదాపు దశాబ్దం క్రితం వరకు భద్రతా దళాలు ప్రవేశించడానికి కుదరని బస్తర్ ప్రాంతంలోని 70 శాతాన్ని ఇప్పుడు మా ఆధిపత్యంలోకి తీసుకురాగలిగాము. అయితే మా కార్యాచరణ పరిధి వంద శాతం. తక్కువ సమయంలోనే మొత్తం ప్రాంతాన్ని మా ఆధిపత్యంలోకి తీసుకువస్తాం”అన్నారు.
ప్రధానంగా అబుజ్మద్ (నారాయణ్పూర్ జిల్లా), ఇంద్రావతి టైగర్ రిజర్వ్ (బీజాపూర్ జిల్లా), కర్రే గుట్ట కొండలు (KGH) (బీజాపూర్ మరియు తెలంగాణ సరిహద్దు) , రెండు రాష్ట్రాలను వేరు చేసే శాశ్వత ఇంద్రావతి నది వెంబడి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతాలు పోలీస్ స్టేషన్ , బేస్ క్యాంప్ లేని ప్రాంతాలుగా ఉన్నాయి.వాటిని క్రమంగా ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
అంతరాన్ని తగ్గించడం
2013లో పోలీసులు , పారామిలిటరీ దళాల ఉనికి ఈ ప్రాంతంలో చాలా పరిమితంగా ఉందని ఐజీ అన్నారు.అయితే 2025లోకి వచ్చేసరికి బస్తర్లో 300 భద్రతా శిబిరాలు (ఫార్వర్డ్ బేస్లు అని కూడా పిలుస్తారు) , 100 కి పైగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇది భద్రతా దళాల విస్తారమైన కార్యాచరణకు ఎంతో ఉపయోగంగా వుందన్నారు. “వీటివల్ల రెండు పనులు అవుతున్నాయి, ఒకటి, భద్రతా లోపం కనిపించడం లేదు, రెండవది లాంచ్ బేస్లు టార్గెట్ గా ఎంచుకున్న ఆపరేషన్ ప్రాంతాల దూరం తగ్గింది” అని పట్టిలింగం అన్నారు.
స్థానిక ప్రజలు, పోలీసులు ఇద్దరికీ ఉపయోగపడేలా మొబైల్ టవర్ల నెట్వర్క్: నేడు, బస్తర్ ప్రాంతంలో దాదాపు 800 మొబైల్ టవర్లు ఉన్నాయి. మొబైల్ , ఇంటర్నెట్ కనెక్టివిటీ ని ఆ ప్రాంతమంతా కవర్ చేస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం చేతిలో సెల్ ఫోన్లు వున్నా నెట్ వర్క్ సిగ్నల్స్ అందేవి కావని తెలిపారు.
స్వేచ్ఛగా తిరగడానికి రహదారులు
“డోర్నపాల్-జాగర్గుండ-బాసగూడ లాగా - రోడ్డు కనెక్టివిటీని మనం తిరిగి స్థాపించగలం" అని ఐజి అన్నారు. లేదా, సున్నితమైన నారాయణపూర్-బాసగూడ-దంతేవాడ ప్రాంతాలను విస్తరించవచ్చుకొత్త జాతీయ రహదారి త్వరలో నారాయణపూర్ను గడ్చిరోలికి కలుపుతుంది, అబుజ్మద్ పర్వత ప్రాంతాల గుండా వెళుతుంది , మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని లాహేరి , భమ్రాఘర్ను కలుపుతుంది"అని తెలిపారు.అదే సమయంలో, విద్యుత్ కనెక్టివిటీ కూడా మెరుగుపడుతోంది.“కనెక్టివిటీ పెరగడం సమస్యకు ప్రధాన విరుగుడు,” అని ఆయన అన్నారు. “ఇది ఒంటరితనాన్ని అంతం చేస్తుంది” అని అభిప్రాయపడ్డారు.
సౌకర్యాల కల్పనకు ఇదే సమయం
భద్రతా ప్రమాణాలు ఈ ప్రాంతంలో పెరిగిన తరువాత ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఆసుపత్రులు, పాఠశాలలు, బ్యాంకులు , ప్రజా పంపిణీ సేవలు మెరుగు పడాలి.భద్రతాపరంగా మార్పుల కారణంగా ప్రభుత్వంలో అన్ని విభాగాలకు పని లభిస్తోంది.పని చేయడం ప్రారంభించాయి.సమయం వృధా చేయకుండా ప్రజలకు సౌకర్యాలను కల్పించాల్సిన సమయమిది.
ఉదాహరణకు, జాగర్గుండ ఇప్పుడు ఒక తహసీల్, అయినప్పటికీ ఇది దాదాపు ఒక గ్రామంగానే ఉంది. దీనికి ఒక తహసీల్ కార్యాలయం ఉంది. కానీ అక్కడ తహసీల్దార్ , రెవెన్యూ మరియు సిబ్బంది లేరు. గ్రామస్తులు తమ ప్రాథమిక పనులు చేసుకోవడానికి సుక్మాకు వెళ్లాలని అంటున్నారు. బస్తర్ గిరిజనులు ఇప్పటికీ సుదూర ప్రాంతాలలో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.ఈ ప్రాంతాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేవు.
15 సంవత్సరాల పాటు సాగిన తీవ్ర ప్రయత్నాల తర్వాత భద్రతా బలగాలు విజయం సాధించాయి.ఈ ప్రాంతంలో ఆపరేషన్స్ లో పాల్గొన్న భద్రతా దళాలకు గతంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ప్రాంతం ఉనికి తెలవక వందలాది మంది భద్రతా సిబ్బంది సంవత్సరాలుగా మావోయిస్టుల ఆకస్మిక గెరిల్లా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ వ్యూహాలు , సంసిద్ధతను నిరంతరం మెరుగుపరచడం ద్వారా వారు చివరకు మావోయిస్టులను ఇరుకున పెట్టగలిగారు.
కొత్త బస్సు సర్వీస్
ఉదాహరణకు నేడు, తాడ్మెట్ల ఒక భయంకరమైన వాతావరణం నుండి బయటపడింది. ఒక వైపు డోర్నపాల్ మరొకవైపు తహసీల్ ప్రధాన కార్యాలయం వున్న జాగర్గుండ ద్వారా సుక్మాకు వేసిన రహదారితో తాడ్మెట్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రైవేట్ ఆపరేటర్ నడుపుతున్న బస్సు వారి రాకపోకలను సులభం చేసింది. స్థానికుల జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే గతంలో వారు సుక్మా చేరుకోవడానికి మైళ్ళుకు మైళ్లు నడవాల్సి వచ్చేది.బస్సు రోజుకు ఒకసారి సుక్మా నుండి పువర్తి అనే మారుమూల గ్రామానికి తిరుగుతుంది. కానీ దాని ఫ్రీక్వెన్సీ తరువాత పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
బస్తర్లోని అనేక పూర్వ మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలలోని గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత స్పష్టంగా కనిపించేది ఏమిటంటే, తిరుగుబాటుదారులకు వారి మద్దతు తగ్గుతోంది. ఇది మారిన భద్రతా పరిస్థితులలో కీలకమైన అంశం. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, మార్చి 2026 నాటికి మావోయిస్టు తిరుగుబాటును పూర్తిగా అంతం చేయకపోయినా, కనీసం ఉద్యమాన్ని నిరాయుధీకరించాలని భద్రతా అధికారులు ఆశిస్తున్నారు .
క్లియర్ అండ్ హోల్డ్
విజయానికి కీలకం "క్లియర్ అండ్ హోల్డ్" విధానం, ఇక్కడ దళాలు కొత్త ప్రాంతాలలో ముందుకు సాగుతున్నాయి, ప్రతి ఐదు కిలోమీటర్ల దూరంలో ముందుకు పోస్టులను ఏర్పాటు చేస్తున్నాయి. భద్రతా , పౌర పరిపాలన కేంద్రాలుగా పనిచేసే వెబ్ లాంటి స్థావరాల గ్రిడ్ను సృష్టిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపధ్యంలో మావోయిస్టులు తమ బలమైన ప్రాబల్య ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి , ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులువుగా పలాయనం చిత్తగించే పరిస్థితులు లేకుండా పోయాయి. దొరక్కుండా తప్పించుకునే అవకాశాలు మృగ్యమవుతున్నాయి.
“ఈ రోజు, మన దగ్గర 70,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు.వీరు స్థానిక పోలీసులతో పాటు, సెంట్రల్ బస్తర్లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఉత్తర బస్తర్లోని సశస్త్ర సీమా బల్ (SSB), దక్షిణ బస్తర్లోని CRPF లకు చెందినవారు, ”అని IG అన్నారు.
“పరిపాలన దృక్కోణం నుండి, ప్రభుత్వ పథకాలను స్థానికులకు అందించడానికి మేము ఈ పోస్టుల చుట్టూ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసాము” అని ప్రస్తుతం బస్తర్ వ్యాప్తంగా భద్రతా కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న పట్టిలింగం తెలిపారు. “ఇది స్థానిక గ్రామస్తులతో మాకు నమ్మకాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది” అని ఆయన అన్నారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు
బయటి ప్రపంచం గురించి అవగాహన లేని , బయటి ప్రపంచం తమను దోచుకుంటుందనే మావోయిస్టుల ప్రచారం ద్వారా ప్రబావితమైన చాలా మంది గ్రామస్తులు,ఇప్పుడు మరొక వైపును స్వయంగా చూడగలుగుతున్నారు. “సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం వల్ల ప్రభుత్వం పట్ల వారి దృక్పథం , వైఖరిలో మార్పు వచ్చింది” అని పట్టిలింగం అన్నారు.
KGH, అబుజ్మద్ ఆపరేషన్ల సమయంలో, భద్రతా దళాలు వరుసగా 31 మంది, 28 మంది మావోయిస్టులను హతమార్చాయి. ఇందులో 29 మంది మహిళా క్యాడర్లు ఉన్నారు. పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.అందులో SLRలు, INSAS రైఫిల్స్,303 రైఫిల్స్,12-బోర్ రైఫిల్స్,బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, IEDలలో ఉపయోగించే పేలుడు పదార్థాలు వున్నాయి.
2001 నుండి, భద్రతా దళాలు , మావోయిస్టుల మధ్య బస్తర్లో 3,300 కంటే ఎక్కువ ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 1,323 మంది భద్రతా సిబ్బంది, 1,503 మంది మావోయిస్టులు మరణించారు. బస్తర్ రేంజ్ పోలీసులు అందించిన డేటా ప్రకారం, భద్రతా సిబ్బందిలో ఎక్కువ ప్రాణనష్టం ఈ ప్రాంతంలో 2001-2015 మధ్య జరిగింది. అయితే మావోయిస్టులు 2015 నుండి ఎదురుదెబ్బలను ఎదుర్కోవడం ప్రారంభించారు. 2016- మే 2025 మధ్య 923 మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 400 మందికి పైగా గత 17నెలల్లోనే ఎన్ కౌంటర్ అయ్యారు.
2016 నుండి మార్పు
గత 25 సంవత్సరాల డేటా చూస్తే మావోలు , భద్రతా దళాల మధ్య పోరులో గణనీయమైన హెచ్చు తగ్గులు ఉన్నాయి. కానీ 2016 నుండి భద్రతా దళాలకు అనుకూలంగా పరిస్థితులు మారి పట్టు సాధించారు.మరో డేటాను తీసుకుంటే.. 2001 నుండి బస్తర్ ప్రాంతంలో వివిధ హోదాలకు చెందిన 7,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదులుకుని లొంగిపోయారు. వారిలో 2016 నుండి లొంగిపోయిన వారు దాదాపు 5,400 మంది ఉన్నారు. వీరిలో 2024లో 800 మంది , ప్రస్తుత సంవత్సరం మే చివరి వరకు 555 మంది లొంగిపోయారు.
“గత రెండు సంవత్సరాలలో లొంగిపోయేవారి సంఖ్య పెరిగింది” అని పట్టిలింగం అన్నారు. అంటే జన్ మిలిషియా (గ్రామాల్లోని ప్రజల మద్దతు సమూహాలు) సభ్యులతో సహా వివిధ దిగువ స్థాయి కార్యకర్తలతో పాటు , అగ్ర , కీలక మావో క్యాడర్ ఆయుధాలు విడిచిపెట్టారని పట్టిలింగం అన్నారు. అదే సమయంలో, లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బడ్జెట్ నిధులు కూడా చాలా రెట్లు పెరిగాయి.
తప్పుడు అరెస్టులు, చట్టవిరుద్ధ హత్యలు
అరెస్టు చేయబడిన మావో క్యాడర్ విషయంలో తప్పుడు అరెస్టులన్న వాదన వుంది. ఇది నిజం కూడా. 2001 నుండి 13,000 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ దాదాపు 2016 నుండి అరెస్టు అయినట్లు చెబుతున్న వారు వీరిలో 6,600 మంది ఉన్నారు. ఈ వివాదం ఎక్కువగా అరెస్టులు, కొన్ని ఎన్కౌంటర్ల చుట్టూ ఉంది. ఎందుకంటే స్థానిక పౌర హక్కుల కార్యకర్తలు , గిరిజన నాయకులు చెబుతున్న దాని ప్రకారం అరెస్టు చేయబడిన ఎన్ కౌంటర్ అయిన వారిలో చాలా మంది మావోయిస్టులు కాదని, సాధారణ పౌరులేనని అంటున్నారు., పోలీసులు మాత్రం ఈ ఆరోపణను ఖండిస్తున్నారు.
2012లో సుక్మా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ అపహరణ తర్వాత, మావోయిస్టుల షరతుల మేరకు అరెస్టుల యొక్క వాస్తవికతను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది.నిర్దోషులయిన అనేక మందిని అరెస్టు అయ్యారని తేల్చిన కమిషన్ ,వారిపై కేసులను ఎత్తివేయాలని సిఫార్సు చేసింది.
ఇటీవల కూడా ఐదు వామపక్ష పార్టీలు బస్తర్లో జరుగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాయి.
Next Story