సోమవారం నుంచి పిడుగుల వర్షం
x
వాతావరణ పరిస్థితిని వివరిస్తున్న మ్యాప్

సోమవారం నుంచి పిడుగుల వర్షం

రాష్ట్రంలోని 32 మండలాల్లో వడగాలు.. సోమవారం నుంచి ఉత్తరాంధ్రలో 3 రోజులు పిడుగుల వర్షాలు


రాష్ట్రంలో వాతావరణం మరోసారి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం (05-04-2026) రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించడం ఈ వాతావరణ మార్పులకు కారణమని వాతావరణ సంస్థ తెలిపింది. ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి. చాలా మండలాల్లో 42 డిగ్రీలు కంటే పెరుగుతోంది.

తీవ్ర వడగాలు ఎక్కడ ఎక్కడ?

శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లాలో గుర్ల, సంతకవిటి మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, సీతంపేట మండలాలు, పోలవరం జిల్లాలో గంగవరం, కూనవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో 2మండలాలు, విజయనగరంలో 8, మన్యం 9, పోలవరం 3, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో సాధారణ వడగాలు వీస్తాయని ప్రకర్ జైన్ తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ వడగాల వల్ల ఎక్కువగా బాధపడవచ్చని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది.

సోమవారం నుంచి వర్షాలు.. పిడుగుల హెచ్చరిక

ఉత్తరాంధ్ర జిల్లాల్లో సోమవారం నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. “చెట్ల క్రింద ఎంత మాత్రం నిలబడవద్దు. పిడుగులు పడే ప్రమాదం ఉంది” అని రైతులు, ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

ఎండలు ఇంకా తీవ్రం.. గరిష్ట ఉష్ణోగ్రతలు

ఆదివారం మన్యం(జిల్లా) వీరఘట్టం,నెల్లూరు(జిల్లా) నెల్లూరుపాలెంలో 42.4°C, తిరుపతి(జిల్లా) రేణిగుంటలో 42.3°C, మార్కాపురం(జిల్లా) నందన మారెళ్లలో 41.8°C, కడప(జిల్లా) ఒంటిమిట్టలో 41.5°C, కృష్ణా(జిల్లా) పెద్దపారుపూడిలో 41.3°C, చిత్తూరు(జిల్లా) పలమనేరు, ప్రకాశం(జిల్లా) చెరువుకొమ్ము పాలెంలో 40.9°C, కర్నూలు(జిల్లా) తోవి, శ్రీకాకుళం(జిల్లా) జి. సిగడాంలో 40.7°C, అనంతపురం(జిల్లా) భట్టువానిపల్లిలో 40.5°C, పల్నాడు(జిల్లా) గురజాలలో 40.4°C, విజయనగరం(జిల్లా) సంతకవిటిలో 40.3°C, నంద్యాలలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు, 66 మండలాల్లో 40°C కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చని విపత్తుల సంస్థ హెచ్చరించింది.

ప్రజలు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి

డీహైడ్రేషన్‌ను నివారించడానికి ORS ప్యాకెట్లు, ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. రైతులు పంటలు, పొలాల్లో తగిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 1070, 1077 హెల్ప్‌లైన్ నంబర్లకు సంప్రదించాలని కోరింది. వాతావరణ మార్పులు రాబోయే రోజుల్లో కూడా కొనసాగవచ్చని, ప్రజలు అప్పుడప్పుడు అప్‌డేట్స్ చూసుకోవాలని సంస్థ సూచించింది.

Read More
Next Story