ఒట్టుపెట్టి చెప్పి వంచించిన పెద్ద వారిని ఏమి చేయాలి?
x

ఒట్టుపెట్టి చెప్పి వంచించిన పెద్ద వారిని ఏమి చేయాలి?

ఇదీ మన కథ! ఈ రాజ్యాంగ చీకటి చరిత్రకు 50 ఏళ్లు

రాష్ట్రపతి ప్రమాణం – రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి అన్న స్పష్టమైన హామీ ఉంది. “నేను నా అత్యుత్తమ సామర్థ్యంతో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, కాపాడతాను, సమర్థిస్తాను.” అని ఆర్టికిల్ 60 ప్రత్యేకంగా రాష్ట్రపతికి ప్రమాణ పదాలను రాజ్యాంగం పేర్కొన్నది.

“నేను ఫలానా, భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను/ ఆత్మసాక్షిగా (సోలెమ్న్) గా ప్రమాణం చేస్తున్నాను, నేను రాష్ట్రపతి పదవిని నిబద్ధతతో నిర్వహిస్తాను. భారత రాజ్యాంగాన్ని నా అత్యుత్తమ సామర్థ్యంతో పరిరక్షిస్తాను, కాపాడతాను, సమర్థిస్తాను. ప్రజల సేవకు, వారి సంక్షేమానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను.”

ఈ ప్రమాణాన్ని పెద్దలు మర్చిపోయినప్పుడు, భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడుతుంది. అందుకే రాష్ట్రపతి పదవికి ఇచ్చిన ప్రత్యేక ప్రమాణం అనేది – కేవలం విధులు నిర్వహించడంకాదు, రాజ్యాంగాన్ని ‘పరిరక్షించాలి, కాపాడాలి, సమర్థించాలి’ అనేది.

ఇది మిగిలిన ప్రభుత్వ పదవుల కంటే విభిన్నమైనది. మంత్రులు తదితరులు తమ“రాజ్యాంగాన్ని నిబద్ధతగా పాటిస్తామని” మాత్రమే ప్రమాణం చేస్తారు. కానీ రాష్ట్రపతి మాత్రం రాజ్యాంగాన్ని కాపాడాలన్న బాధ్యతతో ప్రమాణం చేస్తారు. అహ్మద్ ఈ ప్రమాణాన్ని విస్మరించారు.

“ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ – గౌరవప్రదమైన స్వాతంత్ర్య సమరయోధుడే కానీ రాజ్యాంగ రక్షణలో విఫలమైన వ్యక్తి”. అహ్మద్ గారు ఢిల్లీలో చదివి, కేంబ్రిడ్జ్‌లో విద్యనభ్యసించారు. లాహోర్, గువాహటిలలో న్యాయవాదిగా పనిచేశారు. అసోంలో 1939లో ఆర్థిక మంత్రిగా, 1966లో కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అంత గొప్ప చరిత్ర ఉన్నవారే, ఒక రబ్బర్ స్టాంప్‌ పాత్ర పోషించడమే అత్యంత దురదృష్టకరం.

రాష్ట్రపతి ఎవరైనా సరే కాని చేసిన ప్రమాణం ఎలాంటిదో తెలుగులో చెప్పుకుంటే ‘ఒట్టు పెట్టి’ ఆ పని చేస్తానని అనుకోవాలన్న మాట. మన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న అద్భుతమైన పదాలు, పెదాలు దాటని పదాలు అయితే న్యాయమా. “నేను, భారతదేశ రాష్ట్రపతిగా, నా అత్యుత్తమ సామర్థ్యంతో భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, కాపాడుతాను సమర్థిస్తాను.” అని మన భారత రాజ్యాంగం, ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి ప్రమాణ అక్షరాలు ఇవి. ఎమర్జన్సీలో కాదో ఎప్పుడెప్పడు రాజ్యాంగం భంగమైందో, ఏ విధంలో సుప్రీంకోర్టు కొట్టి వేయపడిన పార్లమెంట్ శాసనం పనికిరాదనుకున్నారో, దాని మీద సంతకం చేసిన ప్రతి రాష్ట్రపతి, ప్రతి మంత్రి, ఎంపీ సిగ్గు పడవలసిన వారు, ఒట్టు వదిలేసినట్టు. రాజ్యాంగాన్ని తప్పు చేసినట్టు.

ఈ చీకటి రాజ్యాంగ చరిత్రకు 50 ఏళ్లు

50 ఏళ్లయింది. 1975 జూన్ 26న భారతదేశంలో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. ఆ ప్రకటనపై సంతకం చేసింది నిజమే కాని అదేమటి తెలియకుండా, చదవకుండా, అర్థం చేసుకోకుండా అర్థరాత్రి ప్రకటన చేస్తే, ఆ తీవ్రమైన సంక్షోభం కలిగించిన విషయం మరునాడు రాష్ట్రపతి నిద్రలేచిన తరువాత వారికి తెలిసింది.

ఇది స్వతంత్ర భారత చరిత్రలో అతి ఘోరమైన ప్రజాస్వామ్యపు సంక్షోభం. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సూచన (ఆజ్ఞ) మేరకు ఈ అత్యవసర స్థితిని ప్రకటించారు.

ఇది రాజ్యాంగ మామూలు ఉల్లంఘనా? రాజ్యాంగ క్రిమినల్ మహానుభావులందరికీ శిక్ష విధించాల్సిందే. కాని దాని గురించి రాజ్యాంగంలో లేదు, ఇండియన పీనల్ కోడ్ లో లేదు, కొత్త క్రిమినల్ చట్టం 2023న మహాఘనత వహించిన మన పార్లమెంట్ చేసిన చట్టం ఇది. ఉరిశిక్ష వేయకూడదు. జైలుశిక్షకు సరిపోదు. కేవలం ఇది రాజ్యాంగ విరుద్ధ ప్రకటన అంటేచాలా?

అన్నిటికన్నా దారుణం ఏమంటే అధికారులు ఆర్టికిల్ 21 అనే జీవన హక్కుకింద ‘‘చంపేసే హక్కును అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు ఉందన్నారు. వాడుకున్నారు కూడా. చివరకు సుప్రీంకోర్టు కూడా ఇటువంటి ఎమర్జన్సీలో చంపే అధికారం కూడా ఉందంటే ఏం అన్యాయం కదా. అందువల్ల కొన్ని వందలమందిని చంపేసారు. ఆ తరువాత ఆనాటి ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మేమేం చేయలేం అని చేతులత్తేసింది. ఆ తరువాత హెచ్ ఆర్ ఖన్నా అనే మహానుభావుడు ఈ అధికారం ఉండనే ఉండదు అని ధైర్యంగా చెప్పారు. ఆవిధంగా తీర్పు ఇచ్చినందుకు సిజెఐ స్థానం కోల్పోవలసి వచ్చింది. ‘‘నాకు తెలుసు, ఈ తీర్పు నా పదవి జారుతుందని తెలుసు. అయినా సరే రాజ్యాంగంలో కాపాడుకోవలసిందే’’ అని బంధువులతో చెప్పారు. ఆయన పట్టించుకోలేదు. బోలెడు సిజెఐ పదవులు వస్తాయి పోతాయి. కాని హెచ్ ఆర్ ఖన్నా చరిత్రలో మిగిలి ఉంటారు. ప్రధానమంత్రులు ఎందరో వస్తారు పోతారు. రాజకీయాలు పోతాయి. భారత రాజ్యాంగం ఉంటాయి. ఎంత నియంత అయినా ఖన్నావంటి పెద్దలనే గుర్తుంచుకుంటారు.

ఇటువంటి రాష్ట్రపతి మహాఅభిశంసనానికి అర్హులు

నిజంగా రాజ్యాంగం బతికే ఉంటే ఇంపీచ్‌మెంట్ చేయాలి. దాన్ని పదవీ విరమణ అనేవాళ్లు సరికాదు. మహాఅభిశంసనం అని కొందరు భారీ పదం వాడతారు. ఇది కేవలం ఒక పాలనాపరమైన తప్పిదం అని వదిలేయడమా? కనీసం ఒక్కో నేరస్థుడికి పదికోట్ల రూపాయల నష్టపరిహారం ఇస్తారా? ఇటీవల విమాన దారుణమైన సంఘటనను వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ విమానం డాక్టర్లు ఇతర సిబ్బంది వారు చనిపోయారు. ఒక అమ్మాయి ప్రశ్నించింది.. నాకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారంటున్నారు. మీరు ఇవ్వడం కాదు. కోట్ల రూపాయలు నేనిస్తాను. మా నాన్నను తెచ్చివ్వండి’ అని డిమాండ్ చేసింది. ఈ దారుణానికి బాధ్యులైన ప్రతి రాజ్యాంగ అధికారులు జవాబు ఇవ్వాలి. ఇస్తారా? అదికాకపోయినా అటువంటి అనేక రాజ్యాంగ దారుణాలను ఇంపీచ్ చేయవలసింది. సిగ్గు సిగ్గు.

అత్యవసర పరిస్థితి విధించడాని సంఘటనలు ఇవి:

• జూన్ 12, 1975: అలహాబాద్ హైకోర్టు ఇందిరా గాంధీ ఎన్నికలు చట్టవిరుద్ధమని తేల్చి, ఆమె ఎంపీగా ఎంపికను రద్దు చేసింది. ఇది తప్పు కాదని ఎవరూ అనడానికి వీల్లేని నేరం.

• జూన్ 24, 1975: సుప్రీం కోర్టు ఆమె పదవిని నిలిపివేయకుండా స్టే ఇచ్చింది. రాజ్యాంగంలో ఈ స్టే అధికారం ఎక్కడిచ్చారు? అది నీతి నిజాయితీ ఉన్న వి ఆర్ కృష్ణ అయ్యర్ గారింటే చాలా అభిమానం. గొప్ప తీర్పులు ఇచ్చిన మహానుభావుడు. కాని ఇందిరాగాంధీకి ఈ దశలో స్టే ఇవ్వడం ఏమిటి? ప్రపంచంలో ప్రజాస్వామ్య రాజ్యంలో ఎక్కడైనా ఇటువంటి స్టేలు ఇస్తారా. ఏం స్టే? పదవిలో కొనసాగాలి. కాని ఓట్లు వేయకూడదు. చట్టాలు చేయవచ్చు. చివరకు ఆ స్టే ఎందాకా వెళ్లిందంటే ఎమర్జన్సీ విధించి కోట్లాది మానవులను జైలుకు పంపించారు. కొన్ని వందలాది కుటుంబాలవారికి స్టెరిలైజేషన్ బలవంతంగా జరిపించేందుకు కారణం ఈ స్టే కాదా? మన జనం ఎంత గొప్పవాళ్లంటే రెండున్నర ఏళ్లలో అన్నీమరిచిపోయే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు ఇందిరాగాంధీని మళ్లీ గెలిపించి పరిపాలించామ్మా పరిపాలించు అన్నారు.

• జూన్ 25, 1975: జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలో “సంఘర్ష్ యాత్ర” నిర్వహించి, “పోలీసులు అక్రమ ఆదేశాలను పాటించవద్దు” అంటూ పిలుపునిచ్చారు. అదే ఎమర్జన్సీకి కారణంగా నిందిస్తారు

• జూన్ 26, 1975: “అంతర్గత కల్లోలాలు ఉన్నాయట” ఆ ఆధారంగా రాష్ట్రపతి (మొదటి పౌరుడు, ఒట్టు మరిచిపోయి గట్టు దాటినట్టు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఆ రాత్రి ప్రధాని అధికారంగా మంత్రివర్గ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తిగత లేఖతో అత్యవసర పరిస్థితిని తక్షణమే విధించాలని కోరారు. రాష్ట్రపతి అహ్మద్ ఆ లేఖను చదివి, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, వెంటనే ఆమోద ముద్ర వేశారు.

దీన్నే ఏకపక్ష నియంతృత్వం అంటారు

ఆర్టికల్ 74 – మంత్రివర్గ సలహా లేదు. “The President shall, in the exercise of his functions, act in accordance with the advice of the Council of Ministers…” Constitution of India (as it stood in 1975)

కానీ ఇందిరా గాంధీ అత్యవసర స్థితి ప్రకటనను మంత్రివర్గం ముందుకు తీసుకురాలేదు. ఆమె Transaction of Business Rules, Rule 12 ప్రకారం తాత్కాలికంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇది రూల్ అట, రాజ్యాంగ అధికరణాలకు లేదు. ఆర్టికిల్ 74 కింద మంత్రివర్గం ఆలోచన లేదు.

సంతకం చేయడానికి ముందు రాజ్యాంగం చదవలేదా.

“ప్రధాని పంపిన లేఖను రాష్ట్రపతి ఆ రాత్రే సంతకం చేశారు. అప్పటికే దేశం ప్రజాస్వామ్యం నుంచి విపత్తు పాలనలోకి జారిపోయింది.” అని జ్ఞాన్ ప్రకాశ్ రచయిత Emergency Chronicles: Indira Gandhi and Democracy’s Turning Point అనే పుస్తకంలో రాసారు.

రాజ్యాంగం ఏమంటుందో ఓసారి చదవండి

ఆర్టికల్ 352 – అత్యవసర పరిస్థితి ప్రకారం, “భారతదేశం భద్రతపై యుద్ధం, బాహ్య దాడి లేదా అంతర్గత కల్లోలాల కారణంగా గందరగోళం ఏర్పడినపుడు” రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. కానీ ఇది కేవలం రాష్ట్రపతి వ్యక్తిగత నిర్ణయం కాదు. ఇది “మంత్రివర్గ సలహాపై మాత్రమే” ప్రకటించవలసి ఉంటుంది.

ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు. ప్రధాన మంత్రి ఆదేశించవలసిన నిర్ణయం కాదు. ఒక్క మైండ్ ద్వారా నిర్ణయించడం కాదు. ఇన్నాళ్లూ ప్రధానమంత్రితో ఓ ఇరవై మంది మంత్రులు కలిసి, అవునో కాదో పరిశీలించి, కనీసం ఒక్కడైనా కాదంటే ఆపే అవకాశం ఉపయోగించి ఎమర్జన్సీని విధించేవారు కాదు. అందుకని మంత్రివర్గ సలహా ఇవ్వాలని రాజ్యాంగం స్పష్టం గా రాసింది.

"ప్రెసిడెంట్ సంతృప్తి" అంటే ఇదా

జూన్ 25, 1975 రాత్రి 11.15కి రాష్ట్రపతి తన కార్యదర్శిని పిలిచి, ప్రధాని నుండి వచ్చిన "టాప్ సీక్రెట్" లేఖను చూపించారు. అందులో ఆమె కేబినెట్‌ను సంప్రదించాలనుందని కానీ సమయం లేదని పేర్కొన్నారు. దీంతో, వ్యవహార నియమాలలోని నిబంధన 12 ప్రకారం తన విపత్తు అధికారం ఉపయోగించి విధించాలనుందని రాసింది. అందులో అత్యవసర ప్రకటన ప్రతిపాదన కూడా లేకపోయింది. సీనియర్ ఐ ఎ ఎస్ అధికారి కార్యదర్శి బాలచంద్రన్ ‘‘సలహా’’ ఇచ్చాడు, ఇది రాజ్యాంగ విరుద్ధమని. అయినా రాష్ట్రపతి తన పైజామాలో ధరించి బాత్ రూంలో నీళ్లలో ఉంటూ చైతన్యంతో మేధస్సుతో కాక, ప్రధాన మంత్రి సంతకం చేసి పారేశారు. మరుసటి రోజు ఉదయం కేబినెట్ సమావేశం అయ్యాకే, ఆ నిర్ణయాన్ని కేబినెట్ "రాటిఫై" చేసింది. రాటిఫై అంటే సంఘటన జరిగినతరువాత సంతకం. అత్యవసర స్థితి విధించడంలో అసలు ప్రమాదం ఏమిటంటే – రాజ్యాంగం ప్రకారం "ప్రెసిడెంట్ సంతృప్తి" అంటే, మంత్రివర్గ సంతృప్తిని సూచిస్తుంది. కానీ ఆ రాత్రి సంతృప్తి వ్యక్తిగతంగా రాష్ట్రపతి మనోభావంగా మారిపోయింది.

కనీసం చదవకుండా, పుస్తకం చూడకుండా నిద్రమాత్ర వేసుకుని పడుకుంటే ఎమర్జన్సీలు గాక ఇంకేం పరిపాలనానిర్ణయాలు జరుగుతాయి? ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి పత్రికల విద్యుత్‌ సరఫరా బంద్ చేసారు, విపక్ష నాయకులు, వ్యతిరేకులందరూ అరెస్ట్‌ అయ్యారు.

ఇది రాజ్యాంగానికే స్టే

ఆ హైకోర్టు తీర్పు తాత్కాలికం కాదు. దానిమీద జస్టిస్ గారు తాత్కాలిక స్టే మాత్రం నిజం. దానిపైన రాష్ట్రపతి గారు చదవరు. కాని రక్తాక్షరాలతో చరిత్ర లిఖించడం మాత్రం శాశ్వతం. అలహాబాద్ ఉన్నతమైన న్యాయస్థానం ఉత్తమమైన తీర్పు ఇస్తే, మహోన్నత సర్వోత్తమ అనే సుప్రీంకోర్టు న్యాయ స్టే ఇస్తే రాజ్యాంగం గతి ఇదే మరి. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కూడా రాజ్యాంగం ప్రకారం అనుసరిస్తాను అని ప్రమాణం చేసిన మహానుభావుడై. ఒక్కరోజైనా ఆయన పశ్చాత్తాపన చేసినట్టు తెలుసా?

రాష్ట్రపతి అహ్మద్ గారు దేశ భద్రత అనే ప్రమాణాన్ని మర్చిపోయారు. రాత్రి 11:15కి రాష్ట్రపతి తన కార్యదర్శి బాలచంద్రన్‌ను పిలిచి ప్రధాని లేఖ చూపించారు. ఈ సందర్భాన్ని జ్ఞాన్ ప్రకాశ్ రచయిత తన పుస్తకంలో వివరించారు.

రాజ్యాంగానికి రాష్ట్రపతిగారి స్లీపింగ్ పిల్

రాష్ట్రపతిగారు మన భారత రాజ్యాంగాన్ని తెరిచి చదవమన్నాడు. వారి కార్యదర్శి చదవి, వారు, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా చెప్పారు. కాని అప్పడికి రాష్ట్రపతిగారు తక్షణమే ఏదో కొంపలు మునిగినట్టు సంతకం చేసారు. రాత్రి పదిహేనునిమిషాల తర్వాత, ఆర్టికల్ 352 కింద కొంపమునిగే ప్రకటనపై రాష్ట్రపతి అహ్మద్ సంతకం చేసేశారు. ఇదో తప్పుఅనే బాధ వచ్చి ఉండవచ్చు. కాని స్లీపింగ్ పిల్ మాత్రవేసుకుని నిద్రపోయారు.” ఈ సంఘటన రాజ్యాంగం అత్యంత తీవ్రమైన వినాశానికి సంకేతం. ఒక వ్యక్తి ఆధీనంగా వ్యవస్థ మొత్తం నిర్భంధానికి లోనైంది. ఈ సంఘటనపై ఎందుకీ వివరణ? మళ్లీ ఎన్నడూ ఏ రాష్ట్రపతి రాజ్యాంగం మరిచిపోయి నిద్రించే సంఘటన రాకూడదు. మళ్లీ ఎమర్జన్సీ రావద్దు అని చెప్పడానికే.

అబూ అనే ప్రముఖ కార్టూనిస్ట్ వ్యంగ్యం చిత్రం రచించారు. ప్రజాస్వామ్యం పై చీకటి చిత్రం అన్నారు.

ఎ.ఎం. అబ్రహాం గారి చిత్రంలో అప్పుడు రాష్ట్రపతి అహ్మద్‌ను పైజామా ధరించి ఉన్నారు. ఇంకేమయినా ఆర్డినెన్సులు ఆర్డర్లు ఇవ్వవలసి ఉందా అని అడిగినట్టు బాత్ టబ్ లోనే ఉన్నట్టు ఓ ఆఫీసర్ గారు బాత్ రూం నుంచే రాష్ట్రపతిని చూడకుండానే తలుపు వెనుక సంతకాలు చేస్తూనే ఉన్నట్టు ఫోన్ లైన్ మీద ప్రధాని ఆదేశాలపై సంతకం చేస్తున్నట్టు చిత్రించారు. ఈ కార్టూన్, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి స్పష్టంగా పత్రికలు చదివేవారికి కనపడుతుంది.

ఇంపీచ్‌మెంట్ ఎందుకు జరగలేదు?

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి “రాజ్యాంగ ఉల్లంఘన” చేస్తే పదవీ విరమణ (ఇంపీచ్‌మెంట్)కి తీసుకురావచ్చు (Article 61). కానీ:

• కాంగ్రెస్ పార్టీకి 2/3 మెజారిటీ ఉండటం వల్ల రాష్ట్రపతి మీద చర్యలకు రాజనీతి సహకరించలేదు.

• ప్రజల్లో పాఠశాలలు, మీడియా మూగబోయిన కారణంగా గొంతెత్తే స్వేచ్ఛే లేదు.

• న్యాయవ్యవస్థ సహకరించే స్థితిలో లేకపోయింది (ADM Jabalpur తీర్పు – “During Emergency, no fundamental rights survive”).

అమెరికా రాజ్యాంగంలో అధ్యక్షుడు తప్పులు చేస్తే మహాఅభిశంసన చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆర్టికిల్స్ లో కూడా ఉంది. అక్కడ అమలు చేస్తారు. మనం పట్టించుకోం. ట్రంప్ పైన ఈ అభిశంసన నోటీసైనా ఇచ్చారు. ఆ మహానుభావుడు నాలుగేళ్ల తరువాత మళ్లీ గెలిచి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నారు. ఆనాడు 1976 తరువాత ఎన్నికల్లో జనం ఇందిరాగాంధీని ఓడించారు. అంతకుముందు అన్యాయం చేసినవారెవరు? రాష్ట్రపతి, ప్రదానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు, సుప్రీంకోర్టు, పోలీసులు, మౌనం వహించిన పిరికి ప్రజలు. అందరూ మొత్తం అటువంటి వారందరూ అన్యాయం చేసారు. కేవలం జనం న్యాయాన్ని గెలిపించారు. వారు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. రాష్ట్రపతినుంచి అన్ని వ్యవస్థలన్నీ నిద్రపోతే నియంత అందరినీ జైలుకు పంపిస్తాడు.

2024లో పార్లమెంటు గుర్తించిన 1975 విపత్తు

49 సంవత్సరాల తర్వాత, భారత పార్లమెంటు అత్యవసర స్థితి బాధితులను స్మరించుకుంది.

స్పీకర్ ఓం బిర్లా చెప్పారు: “అత్యవసర స్థితి భారత చరిత్రలో నల్ల చీకటి పుట. అప్పటి ప్రభుత్వం న్యాయవ్యవస్థను, రాజ్యాంగ విలువలను అణిచివేసింది.” ప్రజాస్వామ్యం కోసం మనం త్యాగం చేసిన వారిని గుర్తించాలంటే, మళ్లీ అదే తప్పిదాలు జరగకుండా చూడాలి. రాష్ట్రపతి భవన్ ఎప్పుడూ రాజ్యాంగాన్ని రక్షించే పటిష్ట కేంద్రంగా ఉండాలి. ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌గారు స్వాతంత్ర్య సమరయోధులు అయినా సరే, తుదకు ఆయన పేరు ప్రజాస్వామ్య ద్రోహానికి నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తి, ప్రజల హక్కుల రక్షణకై నిలబడాలి, సంతకం చేసే యంత్రంగా కాదు. ఆయన ఆ రాత్రి సంతకం చేయకపోతే – చరిత్ర మరోవిధంగా ఉండేది. దేశం 21 నెలల నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది:

రాజ్యాంగ శాశ్వత పాఠాలు

“చరిత్రలో ఎమర్జెన్సీ చీకటియుగం. అన్ని అధికారాలు ఒకరికే కేంద్రీకరించడం, న్యాయవ్యవస్థను నియంత్రించడం, ప్రజల హక్కులను అణిచివేయడం – ఇవన్నీ రాజ్యాంగం పై దాడులు.” ఇది గుర్తు పెట్టుకోవాల్సిన సందేశం: రాష్ట్రపతి మాత్రమే కాకుండా ప్రతి సభ్యుడు, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత వహించాలి. ఇది ప్రజాస్వామ్య పాఠం. రాజ్యాంగాన్ని ప్రతి ప్రజాసేవకుడు, ప్రతీ పౌరుడు అర్థం చేసుకోవాలి. అప్పట్లో రాష్ట్రపతి ఒకసారి సంతకం చేసిన రాత్రి. కనుక భవిష్యత్తులో మరోసారి రాష్ట్రపతి భవన్ రాజ్యాంగాన్ని రక్షించుకుని ప్రతి వ్యక్తీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి.

Read More
Next Story