గాంధీజీ మెచ్చిన అనంతపురం ఆణిముత్యం ‘ప్రభాకర్ జీ’
x

గాంధీజీ మెచ్చిన అనంతపురం ఆణిముత్యం ‘ప్రభాకర్ జీ’

ఇంతకు ఎవరీ ప్రభాకర్ జీ, ఫ్రొపెసర్ ముచ్చుకోట సురేష్ పరిచయం. జూన్ 18న ప్రభాకర్ జీ వర్ధంతి


అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి దగ్గర ఉండే పోతురాయి అనే గ్రామం నేడు కేశవాపురం. ఈ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభాకర్ జీ. ఆయన అనాథ బిడ్డడు, కనుక జన్మతేదీవివరాలు, కులమతాలు దాదాపు తెలియదు. దళితవాడలోని మాల చిదంబరప్ప, సుబ్బమ్మ దంపతులకు ఈ బిడ్డను సాకి జోసెఫ్ అని నామకరణం చేశారు. దురదృష్టవశాత్తు చిదంబర్ కన్నుమూయగా, జోసెఫ్ మొత్తం బాధ్యత సుబ్బమ్మ మీద పడింది. ఆమె కుమారుడి భవిష్యత్తు కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాగా చేరింది.

తన తల్లి గురించి జోసెఫ్ తర్వాత కాలంలో ఇలా రాసుకున్నారు: "మా అమ్మ నన్ను చూసి చాలా విచార పడుతూ ఉండేది. నా మాట వినరా జోసెఫూ అంటూ జాలి గొలుపేటట్లు బ్రతిమాలుతూ ఉండేది. కానీ నేను తోటి విద్యార్థులతో కలిసి అల్లరి చేసే వాడిని. అందులో ఇద్దరితో నాకు చాలా ఆత్మీయత ఏర్పడింది, వారి పేర్లతో నా పేరు జోడించుకొని 'జోసెఫ్ మోహన ప్రభాకరం' అని నా పేరు రాసుకునే వాడిని."

హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్ వంటి ఆటలలో నైపుణ్యం సంపాదించుకున్నాడు. గ్రిగ్ మెమోరియల్ పోటీలలో బహుమతులు పొందారు. ఆటల పోటీల్లో పాల్గొనడానికి 40, 50 మైళ్ళు సైకిల్ మీద వెళ్లేవాడు. అలాగే నాటకాలలో వేషాలు కట్టి ఆంజనేయుడుగా రాణించాడు. ఆయన సహ విద్యార్థులలో సంగీత విద్వాంసులు సంధ్యావందనం శ్రీనివాస రావు, ప్రముఖ కవి సంపత్ రాఘవాచార్యులు, స్వాతంత్ర్య సమరయోధులు రచయిత గుత్తి రామకృష్ణ మొదలైన వారు ప్రముఖులు.

సెకండ్ ఫార్మ్ చదివే టప్పుడు నాన్-డీటెయిల్డ్ వాచకంలో బుద్ధుని గురించి చదివి ప్రభావితుడయ్యాడు. అదే సమయంలో అప్పటి ప్రముఖ నాయకులు కల్లూరు సుబ్బారావు బందరు ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రశంసిస్తుంటే అక్కడ చదవాలనే కోరిక కలిగింది. పరీక్ష పత్రాలున్న గదికి నిప్పు పెట్టి, ఆ కేసు విచారిస్తున్న పోలీసు అధికారి పై హత్యాయత్నం చేసిన చరిత్ర గల జోసెఫ్ ఈ సందర్భంలో పరివర్తనకు లోనై, తన మిత్రుడు గుత్తి రామకృష్ణ చదువుతున్న ఆంధ్ర జాతీయ కళాశాలలో చదవాలని కోరిక కలిగింది.

1936 ప్రాంతంలో జోసెఫ్ ఎవరికి చెప్పకుండా అనంతపురం నుంచి కాలినడకన, రైలు దారి గుండా మద్రాసు వైపు బయలుదేరారు. మర్నాడు బిట్రగుంట చేరాడు, రైల్వే ప్లేగ్రౌండ్ లో ఆంగ్లో ఇండియన్ జట్టు ఆడుతున్న ఫుట్బాల్ ఆటలో పాల్గొన్నాడు. మర్నాడు అదే బాట పట్టి ప్రయాణిస్తూ ఓ అడవి చేరాడు. బాగా ఆకలి వేసింది, ఒక సాధువు జోసెఫ్ ను పిలిచి తన అన్నం గిన్నె ఇచ్చి తినమన్నాడు. ఆ గిన్నెలో మూడున్నర అణాలు కూడా ఉన్నాయి. టికెట్ లేకుండా బెజవాడ దాకా రైలులో ప్రయాణం చేసిన జోసెఫ్, తర్వాత కాలినడకన బందరు చేరాడు.

తన మిత్రుడు గుత్తి రామకృష్ణను కలిసి, ఆంధ్ర జాతీయ కళాశాలలో చేరే అవకాశాన్ని కల్పించమని కోరాడు. ఆ మిత్రుడు తిన్నగా జోసెఫ్ ను కళాశాల ప్రిన్సిపల్, చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అడవి బాపిరాజు దగ్గరకు తీసుకు వెళ్ళాడు.

జోసెఫ్ చాలా నిజాయితీగా తన తుంటరి పనులు, తప్పిదాలను దాచుకోకుండా విప్పి చెప్పి; ఇప్పుడు పరివర్తన కలిగిందని, కళాశాలలో చేరాలనే కోరిక బలంగా ఉందని వేడుకున్నాడు. జోసెఫ్ నిజాయితీ, పట్టుదల, పశ్చాత్తాపం గుర్తించి విశ్వసించిన అడవి బాపిరాజు మహాశయుడికి హృదయం ద్రవించి, జోసెఫ్ ను కళాశాలలో చేర్చుకున్నాడు.

మొదటి నుంచి జోసెఫ్ బాపిరాజుకు ఆత్మీయంగా మారడంతో ఒక చిన్న మార్పు చేశారు. జోసెఫ్ ప్రభాకర మోహనం అని పేరు నుంచి 'ప్రభాకర్' అని మాత్రమే స్థిరపరిచారు. ఆ పూర్వనామం తో తన ఇంటికి వస్తే తల్లి అభ్యంతరం చెప్పవచ్చని బాపిరాజు ఆ మార్పు చేశారు.

అడవి బాపిరాజు తల్లికి సంబంధించిన ఒక గొప్ప సంఘటన గురించి మనం చెప్పుకోవాలి. ప్రభాకర్ కు ఒకసారి తీవ్రమైన స్థాయిలో జ్వరం వచ్చింది, మూసిన కన్ను తెరవకుండా హాస్టల్ గదిలో పడి ఉన్నాడు. బాపిరాజు తల్లికి ఈ విషయం తెలిసి, తలపోటు మందు తీసుకొని గబగబా హాస్టల్ రూముకి వచ్చి, అతని తలకు పట్టించి ప్రేమతో ఒళ్లంతా నిమిరి, జ్వరం నెమ్మదించేదాకా ఉండి వెళ్ళింది. కాసేపటికి ఆ కళాశాలలో ఖాదీ మాస్టర్ గా పనిచేసే శ్రీ సూర్యనారాయణ వచ్చినప్పుడు బాపిరాజు తల్లి అనంతపురం కుర్రాడు ప్రభాకర్ వచ్చిన జ్వరం గురించి చెప్పి బాధపడింది. అతనికి అర్థం కాకపోతే అనంతపురం నుంచి వచ్చిన పొట్టిగా, తెల్లగా ఉన్న కుర్రాడని ఆమె వివరించింది. అతను ప్రభాకర్ కాదు, జోసెఫ్ అని వివరాలు తెలిసినప్పుడు ఆ తల్లి చింతించడం ప్రారంభించింది. తర్వాత ఆమె కుమారుడు బాపిరాజు వచ్చి, ఆమె విశ్వసించే ధర్మసూత్రాలకు అంటరానితనం అనేది ఏ రకంగా విరుద్ధమో నచ్చజెప్పి, ఆమెను సముదాయించారు. అప్పటి నుంచి ప్రభాకర్ అడవి బాపిరాజు ఇంట్లో మనిషై పోయాడు. ఆ తల్లి అమితమైన మమతాను రాగాలు పొందారు. ఈ రకంగా అడవి బాపిరాజు ఇంట్లో అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి జోసెఫ్ లేదా ప్రభాకర్ జీ.


ఎప్పుడూ ఉదయించడమే కానీఎన్నడూ అస్తమించడం ఎరుగని

సర్వోదయ ప్రభాకరుడు

స్వసుఖం బొత్తిగా కోరనివాడు

పరసుఖమునకై పాటుపడిన వాడు

బాధితుల సేవకు తాను అంకితమై

ప్రజలకు త్యాగమార్గం చూపినవాడు..."

--అని దాశరథి కృష్ణమాచార్య చేత ప్రస్తుతింపబడిన ప్రభాకర్ జీ తెలుగు వారిలో గాంధీజీకి అత్యంత సన్నిహితంగా గడిపిన వారిలో ప్రథములు, పదహారణాల గాంధీ అనుయాయి. గాంధీజీకి తైలమర్దన చేయడం, ప్రకృతి చికిత్స కార్యక్రమాలలో సహకరించడం, ఉదయ సాయంకాలాల్లో ఆశ్రమంలో ప్రార్థనలు నిర్వహించడం, ఆశ్రమానికి వచ్చే పెద్దలకు గాంధీజీ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడం. ఆసుపత్రిలో పనిచేయడం ఇది వార్ధా సేవాశ్రమంలో ప్రభాకర్ జీ నిర్వహించిన పనులు.

1947 అక్టోబర్ 2వ తేదీన తాను చదివిన అనంతపురం హైస్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు ప్రభాకర్ జీని అతిథిగా ఆహ్వానించారు. ఆనాటి కార్యక్రమం గురించి అప్పటి 'శ్రీ సాధన పత్రిక' ఈ రకంగా వార్తను ప్రచురించింది: "ఉదయం జాతీయ జెండా అభివందనం ముగిసిన వెనుక, ప్రభాకర్ జీ విద్యార్థి బృందాన్ని బాలబాలికలను వెంటబెట్టుకుని పాత ఊరిలో వీధి వీధిలో మురుగు దొడ్లను ఊడ్చి ఊడ్పించినాడు. మున్సిపల్ మేస్త్రీలు అంత చక్కగా పనిచేసే ఉండలేదు..."

దివిసీమలో 1977 నవంబర్ 19న సంభవించిన మహాప్రళయం వంటి ఉప్పెన చేసిన అతలాకుతల పరిస్థితులను సరిదిద్దుతూ, ఆ సేవా కార్యక్రమాల్లో ఉంటూ జూన్ 18న తనువు అర్పించిన ఆధునిక కాలపు మహర్షి ప్రభాకర్ జీ. ఈ మహనీయుడి గుర్తింపుగా అనంతపురం పాతూరు లో ప్రభాకర్ స్ట్రీట్, మున్సిపల్ స్కూల్ ఏర్పాటు చేశారు.

అలాగే దివిసీమలో చింత కోళ్ల దిన్నె అనే గ్రామానికి ప్రభాకర పురం అని నామకరణం చేశారు. ప్రభాకర్ జీ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా వాస్తవ్యులు గాంధేయవాది డా . నాగసూరి వేణుగోపాల్, కాంగ్రెస్ సేవాదళ్ సోషియల్ మీడియా సమన్వయకర్త డా . ముచ్చుకోట సురేష్ బాబు, పౌర స్పందన వేదిక రాష్ట్ర నాయకులు డా. జి. వెంకటశివారెడ్డి, డా ప్రణయనాథ్ రెడ్డి శివరాంపల్లిలో ప్రభాకర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు

Read More
Next Story