
అనుమతులు లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేదా? బనకచర్లపై రాజకీయాలెందుకు?
అనుమానాలు నివృత్తి చేయాలని మంత్రులకు చంద్రబాబు సూచన
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు సూచించారు.ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరిగింది.ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలు కేవలం రాజకీయ లబ్ది కోసమే లేవనెత్తుతున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు ,వృధాగా పోయే వరద జలాలనే వాడుకుంటామని ,ఆ విషయాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని మంత్రులకు సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది."తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టిన అభ్యంతరం చెప్పలేదు,ఆ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేని బనకచర్లపై ఎందుకు అభ్యంతరం" అని ప్రశ్నించిన చంద్రబాబు ,ప్రజలకు వాస్తవాలు తెలిసేలా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలన్నారు.ఆ బాధ్యత మంత్రులపై మరింత వుందన్నారు.బనకచర్ల ప్రాజెక్ట్పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని సూచించిన ఆయన,ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుందామని వివరించారు.అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు.
ముందుగా మొత్తం 42 అజెండా అంశాలకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ అనంతరం రాజకీయ అంశాలపై చర్చించింది.అమరావతిలో మలివిడతగా 40 వేల ఎకరాల భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.తొలిసారి భూసేకరణ చేసినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడు పాటించాలని నిర్ణయించారు.
ఇంటింటికీ కూటమి ఏడాది విజయాలు
కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాలను జిల్లా స్థాయిలలో నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ,ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.కూటమి ఏడాది విజయాలు ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామన్న ముఖ్యమంత్రి, జులై 1 నుంచి ఎమ్మెల్యేలు ఆ బాధ్యత తీసుకోవాలన్నాని తెలిపారు.ఇప్పటిదాకా అమలైన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలును,ఆటోవాలాలకు ఆర్థిక సహాయం అంశాలను ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.అన్న క్యాంటీన్ల నిర్వహణ, విరాళాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
రెవెన్యూ సమస్యలపై రాజీ వద్దు
రెవెన్యూ సమస్యలపై రాజీ ధోరణి వద్దని మంత్రులు అధికారులకు చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏడాదిలోగా ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో దాటవేత ధోరణి సరికాదని, ఇబ్బందులుంటే తనతో మాట్లాడాలని మంత్రులు , అధికారులకు సూచించారు.తాను కూడా ఈ విషయంపై తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు.
Next Story