Tirumala | శ్రీవారి భక్తులకు సువర్ణదర్శనం ఎలా దక్కబోతోంది..
x
తిరుమలలో స్వర్ణరథంపై ఊరేగుగున్న శ్రీవారు (ఫైల్)

Tirumala | శ్రీవారి భక్తులకు 'సువర్ణదర్శనం' ఎలా దక్కబోతోంది..

ఈ ఏడాది రోజుల వ్యవధిలోనే రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి కారణం ఏమిటంటే..


తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో యాత్రికులకు ఈ ఏడాది అరుదైన దర్శనం దక్కనుంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీవారి భక్తులకు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ తరహా అవకాశం దక్కుతుంది. రెండు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమల ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరుడు పల్లకీపై ఊరేగే సమయంలో గ్యాలరీల్లో ఉండే యాత్రికులకు మంచి దర్శనం కల్పించే దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య యాత్రికులకు వసతికి ఇబ్బంది లేకుండా, అధికారులను సమాయత్తం చేశారు. గదుల్లో వసతులను కూడా మెరుగుపరుస్తున్నారు.
రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు?

తిరుమలలో శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాల నిర్వహించడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు జరగడానికి కారణం అధికమాసం కావడమే. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అందువల్ల ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను "సాలకట్ల బ్రహ్మోత్సవాలు" అని, అధికమాసం కారణంగా వచ్చే ఉత్సవాలను "నవరాత్రి బ్రహ్మోత్సవాలు"గా పరిగణిస్తారు. అధిగమాసం కావడం వల్ల ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహించనున్నారు. అక్టోబర్ రెండో తేదీ చక్రస్నానంతో పరిసమాప్తం అవుతాయి.
అధిగమాసం అంటే...
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఇది చంద్రమాన, సూర్యమాన నెలల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఒక అదనపు నెలగా చేర్చబడుతుంది. అందువల్ల ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఒకటి సాధారణ వార్షిక బ్రహ్మోత్సవం (సాలకట్ల బ్రహ్మోత్సవం) మరొకటి నవరాత్రి బ్రహ్మోత్సవం. 2020 లో కూడా అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరిగాయి. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ ఉత్సవాలను తిరుమలలో ఏకాంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2023లో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది (2025) అదే తరహాలో రెండు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
గత ఏడాది నేర్పిన పాఠం
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 2024 అక్టోబర్ లో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. అంతకుకొన్ని నెలల ముందు టీటీడీ ఈఓగా శ్యామలరావు బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత టీటీడీ చైర్మన్గా బీఆర్. నాయుడు సారధ్యంలో పాలక మండలి ఏర్పడింది. ఆ తరువాత అదనపు ఈఓగా సీహెచ్. వెంకయ్య చౌదరి బాధ్యతలు తీసుకున్నారు. వారితో పాటు సీవీఎస్ఓగా బాధ్యతలు తీసుకున్న అధికారులందరికీ బ్రహ్మోత్సవ నిర్వహణలో పూర్వ అనుభవం లేదు. సీనియర్, అధికారులు, సిబ్బందిని సమన్వయం చేయడంలో ఎలాంటి వివాదాలు, సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు దిగ్విజయం చేశారు. ఆ అనుభవంతోనే ఈ ఏడాది కూడా రెండు బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారులను మమేకం చేయడం, సూక్ష్మ పర్యవేక్షణ ద్వారా సఫలం చేయడానికి కార్యాచరణ ప్రారంభించారు.
యాత్రికులకు వసతి
తిరుమలలో ప్రస్తుతం దాదాపు ఏడు వేల వరకు అన్ని రకాల గదులు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. ఈ గదుల్లో వసతుల పరిశీలనకు ఐదుగురు సివిల్ ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. బ్రహ్మోత్సవాల నాటికి సివిల్ ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయడం, మంచాలు, పరుపులు, దుప్పట్లు, లైట్లు, స్విచ్ లు సక్రమంగా ఉన్నాయా? లేవా అనేది ఆ అధికారులు పరిశీలిస్తున్నారు. రోజుకు ర్యాండంగా 20 గదులన పరిశీలించి, యాప్ లో సమాచారం అప్ లోడ్ చేస్తన్నట్లు ఓ ఇంజినీర్ చెప్పారు. వాటిని ప్రతి రోజూ సాయంత్రి
టీటీడీ ఈఓ శ్యామలరావు పరిశీలించి, అక్కడక్కడా తనిఖీలు కూడా చేస్తున్నారు. అంటే, తిరుమలలో యాత్రికులకు వసతి, అన్నదానం, లడ్డు ప్రసాదాలకు కొరత రానివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారవర్గాల సమాచారం. గదులతో పాటు
గదులు దొరకని వారి కోసం యాత్రికుల వసతి సముదాయం ( Public Amenities Complex PAC ) 3లో సెంట్రల్ లాకర్ తోపాటు ఇంకొన్ని చోట్ల కూడా ఇదే సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ప్రాంతాల్లో వసతుల మెరుగుకు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు.
Read More
Next Story