
చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కాయలు
చిత్తూరు 'మామిడి ధర' ఎందుకు చిన్నబోయింది.?!
కిలో మామిడికి గిట్టుబాటు ధర రూ.12 ఇచ్చినా రైతులు వలవల ఏడుస్తున్నారు? రోడ్డు పక్కన ఎందుకు పారబోస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో మామిడి ధర సంక్షోభంలో పడింది. కాదు కాదు చిన్న పోయింది. దిగుబడి గణనీయంగా పెరగడం రైతుల్లో ఆనందం వికసించినా, ధరలు ఉస్సూరుమనిస్తున్నాయి.
"ఈ సీజన్లో చివరి కాయ వరకు కొంటాం. కిలో కు 12 రూపాయలు మద్దతు ధర నిర్ణయించాం" అని చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు విస్పష్టంగా ప్రకటించారు. మార్కెటింగ్ సదుపాయం మెరుగుపడి, మద్దతు ధర ప్రకటించినా సోమల మండలంలో మామిడికాయలు రోడ్డు పక్కన టన్నుల కొద్ది ఎందుకు పడేశారు?
చిత్తూరు జిల్లాలో మ్యాంగోనగర్ గా ప్రసిద్ధి చెందిన చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండల కేంద్రానికి సమీపంలోని దామరచర్ల ప్రైవేట్ మార్కెట్ మండీల వద్ద ఇచ్చే రేటు కూలీలు రవాణా ఖర్చులకు రావడం లేదని రైతులు ఎందుకు వలవల ఏడుస్తున్నారు. దిగుబడి తక్కువ ఉన్నప్పుడు ధరలు ఉండడం లేదు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడే కాదు. మామిడికాయ నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. ధర లేక రైతులకు నష్టాలు తప్పడం లేదు.
సోమల నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో రోడ్డు పక్కన కాలువ పక్కన పడేసిన మామిడి కాయలు
పెరిగిన దిగుబడి
"చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వాటి నుంచి ఏటా ఐదు లక్షల టన్నులు దిగుబడి వస్తుంది" అని ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూధనరెడ్డి చెబుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 39,895 హెక్టార్లలో తోతాపురి తోపాటు నీలం, అల్పోన్సో, బేనీషా, మల్లిక రకానికి చెందిన మామిడి తోటలు సాగులో ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.
కృష్ణా జిల్లా తరువాత చిత్తూరులో దిగుబడి ఎప్పుడో ఎనిమిది లక్షల టన్నులకు చేరువ అయిందనేది ఓ వ్యవసాయ నిపుణుడి అంచనా.
చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అధికంగా సాగులో ఉన్నాయి. అందులో బంగారుపాళెం 4,163 హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. పులిచెర్ల మండలం 3,668 హెక్టార్లు, కాణిపాకం సమీపంలోని ఐరాల వద్ద 3,366 హెక్టార్లు. సోమల మండలంలో 2340 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉంది. తవణంపల్లిలో 2,773 హెక్టార్లు, నగరి నియోజకవర్గం వడమాలపేటలో 2,264 హెక్టార్లు, పూతలపట్టులో 1,738 హెక్టార్లు, సదుంలో 2,881, చిన్నగొట్టిగల్లు మండలం 2321 హెక్టార్ల విస్తీర్ణంతో మామిడిని సాగు చేస్తున్నారు. ప్రధానంగా పల్ప్ పరిశ్రమకు అవసరమైన తోతాపురి రకం మామిడిని అధికంగా సాగు చేస్తారు.
దిగుబడిని అంచనా వేసిన జిల్లా అధికారులు కిలో తోతాపురి మామిడి కిలో రూ. 12కు కొనుగోలు చేయాలని మద్దతు ధర ప్రకటించారు. అందులో నాలుగు రూపాయలు ప్రభుత్వం, మిగతా ఎనిమిది రూపాయలు చెల్లిస్తుందని ప్రకటించారు. అంతధరకు మొదటి నుంచి పరిశ్రమ వర్గాలు ససేమిరా అన్నాయి.
"ప్రైవేటు మార్కెట్ లో నాలుగుకు మించకుంటే, ఎనిమిది రూపాయలు ఎలా చెల్లించగలం" అని గుజ్జు పరిశ్రమల యజమానులు మొండికేశాయి. మామిడి గుజ్జు పరిశ్రమల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ చర్చించి, ఒప్పించారు.
ధర దక్కక మామిడి కాయలు రోడ్డు పక్కన పడేసిన సోమల మండానికి సమీపంలోనే ఉన్న పులిచెర్ల గ్రామానికి చెందిన గంగారపు రమేష్ ఏమంటున్నారంటే..
గిట్టుబాటు ధర మంచిదే సార్. మేము అంతకూడా కోరుకోవడం లేదని పులిచెర్లకు చెందిన గంగారపు రమేష్ చెప్పారు.
ఎకరా విస్తీర్ణంలో సస్యరక్షణకు రూ.25 వేల నుంచి 30 వేలు అవుతుంది. దిగుబడి వచ్చాక ట్రాక్టర్ లోడు (ఐదు టన్నులు) నూర్పిడి, రవాణాకు రూ. ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపయాలు అవుతుంది" అని రమేష్ వివరించారు.మా అభ్యర్థన ఒక్కటే..
"మాకు అంతకూడా కాదు. ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలకు పరిశ్రమలు అంతేమొత్తం ఇచ్చిన సరిపోయేది" అని గంగారపు రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయన ఆమాట అనడం వెనుక వాస్తవం కూడా ఉంది.
ఫలించని చర్యలు
జిల్లాలోని రైతుల నుంచి మామిడి దిగుబడిని గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. విభిన్న ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని పర్యవేక్షణకు నియమించింది. ఇంత చేసినా మామిడి తోటలు సాగులు చేసిన రైతులకు కష్టాలు, కడగండ్లు, కన్నీరే మిగిలింది. పొరుగు రాష్ట్రాల నుంచి మామిడి కాయలు రాకుండా కట్టడి చేశారు. జిల్లాలోని దిగుబడి మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించడమే కాదు. సరిహద్దుల్లో మహారా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నారు.
దీనికి కారణాలు ఇవి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరవకపోవడం ఒక కారణమైతే. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు కూడా సామర్ధ్యానికి తగినట్లు
పనిచేయకపోవడం. బహిరంగ మార్కెట్ లో కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు ఉంటే, ఎనిమిది ఎలా చెల్లించగలం? కొన్ని పరిశ్రమల వద్దకు టోకెన్లు లేకున్నా, మామిడికాయల లోడుతో వెళ్లిన ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. ఈ ఏడాది మామిడి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చిత్తూరుకు సమీపంలోని గంగాధరనెల్లూరు వద్ద మామిడికాయల లోడుతో బారులుదీరిన ట్రాక్టర్లు
మద్ధతుధర తెచ్చిన కష్టం
మద్దతు ధర బలవంతంగా రుద్దడం వల్లే రైతులకు కష్టాలు తప్పడం లేదనే భావన వినిపిస్తోంది. మార్కెట్టులో ఉన్న ధరలకు ఒకటి లేదా రెండు రూపాయలు అధికంగా ఇచ్చినా రైతులు మామిడికాయలు రోడ్డుపై పడేసే పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను పరిశీలిస్తే, సమాధానం దొరుకుతుంది.
చిత్తూరు జిల్లాలో సుమారు 47 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం, వీటిలో 39 పల్ప్ ఫ్యాక్టరీల నుంచి, 27 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ కొనుగోలుకు స్పందించాయి. ఏడు పరిశ్రమలు తెరవలేదు. అందులో చిత్తూరు జిల్లాలో 35 పరిశ్రమలకు 27 మాత్రమే తెరిచారు. తిరుపతి జిల్లాలో ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి.
జిల్లాలోని ఒకో మామిడి గుజ్జు పరిశ్రమలో రోజుకు 250 టన్నులు ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఉంది. దీనివల్ల అన్ని యూనిట్లు పనిచేస్తే, ఉమ్మడి జిల్లాలోని అన్ని పరిశ్రమలు తెరవడం వల్ల 12 వేల టన్నుల నుంచి 13 వేల టన్నులు మామిడి ప్రాసెస్ చేయవచ్చు. అయితే,
"ప్రస్తుతం ఎనిమిది వేల టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాం" అని పరిశ్రమల ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఆయన ఇంకా ఏమంటున్నారంటే.. ప్రతి పల్ప్ పరిశ్రమ ( Pulp unit)లో ఒకే ర్యాంప్ మాత్రమే పనిచేస్తోంది. మిగతా రెండు, మూడు ర్యాంపులు కూడా వినియోగంలోకి తీసుకుని వస్తే, రైతుల నుంచి కాయలు కొనుగోలు చేయడం కష్టం కాదనేది ఆయన అభిప్రాయం.
చిత్తూరు జిల్లాలో సత్యవేడు వద్ద ఉన్న వెయ్యి టన్నుల సామర్థ్యం కలిగిన పరిశ్రమ తెరవకపోవడం కూడా సమస్యగా మారింది.
రైతుల ఆందోళన
చిత్తూరుకు సమీపంలోని గంగాధరనెల్లూరు వద్ద ఉన్న జైన్ ఫుడ్స్ మామిడి గుజ్జు పరిశ్రమ తోపాటు తమిళనాడుకు సరిహద్దులోని గుడిపాల వద్ద ఉన్న ఫుడ్స్ అండ్ ఇన్స్ పరిశ్రమ వద్ద కొందిరికి టోకెన్లు, ఇవ్వడం, ఇంకొందరికి టోకెన్లు దక్కని స్థితిలో మామిడి కాయల లోడుతో వచ్చిన ట్రాక్లర్లు కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు సరిహద్దు దాటి కూడా బారులుదీరాయి. గుడిపాల మండలంలోని ఆర్ఆర్ఎం జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం టోకెన్లు ఇవ్వడం నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ర్యాంపుల వద్ద కూడా రైతులు పడిగాపులు కాస్తున్నారు.
పరిశ్రమలు ఎందుకు తెరవలేదంటే...
గత ఏడాది, అంతకుముందు మామిడి కాయలు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీల యజమానలు గుజ్జు తీశారు. యూరోపియన్ దేశాల్లో యుద్ధం కారణంగా ఎగుమతులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. దీంతో 1.5 లక్షల టన్నుల వరకు మామిడి గుజ్జు గోదాముల్లో మగ్గుతోంది. 50 లక్షల టన్నులు కొనుగోలుకు ఆరు నెలల కాలానికి యూరోపియన్ దేశాల ప్రతినిధులు కాంట్రాక్టు కుదుర్చుకున్నా, మళ్లీ, ఇరాన్ యుద్ధ మేఘాలు ప్రతిబంధకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ కాయలు కొనుగోలు చేసి, ఉత్పత్తి చేసే గుజ్జు ఏమి చేయాలనేది పరిశ్రమవర్గాల ప్రశ్న.
ఇదీ కారణమే..
సీజన్ ప్రారంభంలోనే ధరల నిర్ణయంపై ఏర్పడిన పీటముడి పరిశ్రమలు కొనుగోలు చేయడంలో జాప్యం జరిగింది. కొందరు రైతు సంఘాల నేతల గొంతెమ్మ కొర్కెలు కూడా రైతులను ఇబ్బందులకు గురి చేశాయని ఓ పరిశ్రమల యజమాని విశ్లేషించారు.
"గతంతో పోలిస్తే, మామిడి గణనీయం పెరిగింది. నాణ్యత కూడా చాలా బాగుంది" అని చెప్పారు. దీనికి కారణం, సకాలంలో వర్షాలు కురవడం వల్ల, జూలై నెలలో రావాల్సిన ఉత్పత్తి జూన్ నెలలో మంచి దిగుబడి వచ్చిందని అంటున్నారు.
ర్యాంపు నిర్వాహకుడికి ఆదాయం?
మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రైతుల నుంచి కొన్ని ఫ్యాక్టరీలే కొంటున్నాయి. కొన్ని చిన్న ఫ్యాక్టరీలు మాత్రం టోకెన్లు లేకుండా తీసుకుంటున్నారు. అక్కడ ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే..
ర్యాంపుల వల్ల కూడా రైతులకు నష్టం కష్టం కలుగుతుంది. ఫ్యాక్టరీ యజమానులు వద్ద రైతులు తీసుకొచ్చే మామిడికాయలు నేరుగా కొనడం లేదు. ర్యాంప్ అంటే.. ఓ వ్యక్తికి మామిడికాయలు కొనుగోలు చేసే బాధ్యత అప్పగిస్తారు. అతనికి కిలో నాలుగు రూపాయలు యజమాని చెల్లిస్తే, ఆ వ్యక్తి రైతులకు మూడు నుంచి మూడున్నర రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ విధానం వల్ల కూడా రైతులకు నష్టం తప్పడం లేదనిది పులిచెర్ల కు చెందిన రమేష్ చెబుతున్న మాట. పరిశ్రమలన్నిటిని తెరిపించి, ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలకు పరిశ్రమల యజమానులు నాలుగు రూపాయలు చెల్లిస్తే రైతుకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధర ప్రకటించింది. కొన్ని పరిశ్రమలు సామర్ధ్యాని కంటే తక్కువగా నిర్వహించడం, కాయలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో రైతులకు కష్టనష్టాలు తప్పడం లేదనే పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది.
చిత్తూరు జిల్లాలో మరో 10 రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం సీజన్ ముగింపునకు రావడానికి పరిశ్రమ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రానున్న రోజుల్లో మామిడి తోటల పరిస్థితి ఏమిటనేది తెలుస్తుంది.
Next Story