Bypolls : కేరళలో నిలంబూర్‌లొ ఇప్పటి వరకు 13.15 శాతం పోలింగ్
x

Bypolls : కేరళలో నిలంబూర్‌లొ ఇప్పటి వరకు 13.15 శాతం పోలింగ్

అధికార ఎల్‌డీఎఫ్ నుంచి ఎం స్వరాజ్, యూడీఎఫ్ నుంచి ఆర్యదన్ షౌకత్, స్వతంత్ర అభ్యర్థిగా పీవీ అన్వర్, బీజేపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థి మోహన్ జార్జ్ పోటీపడుతున్నారు.


కేరళ(Kerala)లోని నిలంబూర్(Nilambur) అసెంబ్లీ నియోజకవర్గానికి నేడు (జూన్ 19న) ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే పీవీ అన్వర్ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అన్వర్ గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన సన్నిహితులపై చేసిన ఆరోపణల కారణంగా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌తో సంబంధాలు బలహీనపడిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

మొత్తం ఓటర్లు 2.32 లక్షలు

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నిలంబూర్ నియోజకర్గంలో వర్షం కురుస్తున్నా.. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల సమయానికి పోలింగ్ శాతం13.15గా నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 263 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.32 లక్షలకు పైగా ఉన్న ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,13,613 మంది పురుషులు, 1,18,760 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరిలో 7,787 మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇంకా 373 మంది విదేశీ ఓటర్లు, 324 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

అభ్యర్థులు వీరే..

మొత్తం10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అధికార ఎల్‌డీఎఫ్ నుంచి ఎం స్వరాజ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నుంచి ఆర్యదన్ షౌకత్, స్వతంత్ర అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర కన్వీనర్ పీవీ అన్వర్, బీజేపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థి మోహన్ జార్జ్ పోటీపడుతున్నారు.

వర్ష ప్రభావం ఉండదు..

షౌకత్ పోలింగ్ కేంద్రాల్లో కలియతిరిగారు. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ శాతంపై వర్షం ప్రభావం ఉండదని విలేకరులతో అన్నారు.

కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనపడడంతో అదనంగా మరో 59 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారని తెలిపారు. తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

నేనే గెలుస్తా..

‘‘యుడీఎఫ్, ఎల్‌డీఎఫ్, ఎన్‌డీఏ అభ్యర్థులు వారి ఎన్నికల ప్రచారంలో మనుషులపై అడవి జంతువుల దాడులు, స్థానిక సమస్యల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. యుడీఎఫ్, ఎల్‌డీఎఫ్ నుంచి నాకు మంచి ఓట్ షేర్ లభిస్తుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. పీవీ అన్వర్ (PV Anvar).

23న ఫలితాలు..

నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. లూథియానా (పంజాబ్), కాళీగంజ్( వెస్ట్ బెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఫలితాలు 23వతేదీ ప్రకటిస్తారు.

Read More
Next Story