
కేరళలో భారతమాత చిత్రపటంపై వివాదం..
గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందా?
కేరళ(Kerala)లో రాజ్భవన్ కార్యాలయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల గవర్నర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం నుంచి విద్యాశాఖ మంత్రి వాకౌట్ చేయడం చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది?
కేరళ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం సంయుక్తంగా ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్యపురస్కార్’ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించాయి. గవర్నర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి(Sivankutty) హాజరయ్యారు. అయితే వేదికపై భరతమాత(Bharat mata చిత్రపటం కనిపించడంతో ఆయన వేదిక నుంచి వాకౌట్ చేశారు. భరతమాత చిత్రపటాన్ని ప్రదర్శించడం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఐకానోగ్రఫీలో భాగమని విలేఖరులతో అన్నారు.
తీవ్ర అవమానం..
మంత్రి తీరును గవర్నర్ కార్యాలయం తప్పుబట్టింది. ఆ తర్వాత ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘మంత్రి వేదిక నుంచి వాకౌట్ చేయడం గవర్నర్ కార్యాలయానికి తీవ్ర అవమానం. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ వెళ్లిపోయే వరకు ప్రేక్షకులు కూడా కూర్చుని ఉండాలి. విద్యాశాఖ మంత్రే భరతమాత చిత్రాన్ని గుర్తించలేదని చెప్పడం దురదృష్టకరం’’ అని పేర్కొంది.
అయితే అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ, మతపర చిహ్నాలను ప్రదర్శించడాన్ని శివన్కుట్టి తప్పుబడుతున్నారు. అలా చేయడం ప్రభుత్వ కార్యక్రమాల లౌకిక స్వభావాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.
మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు..
మంత్రి తీరుకు వ్యతిరేకంగా బీజేపీ యువజన విభాగం, ఏబీవీపీ కార్యకర్తలు తిరువనంతపురంలో శివన్కుట్టి కారును అడ్డుకున్నారు. అనేక జిల్లాల్లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ మంత్రి వాకౌంట్ను తప్పుబడుతూ "భారతీయ సంస్కృతికి, జాతీయ గౌరవానికి అవమానం" అని పేర్కొన్నారు. LDF భారత మాతను వ్యతిరేకించాలని నిర్ణయించుకుందా? అని ప్రశ్నించారు.
మౌనం పాటిస్తున్న గవర్నర్ కార్యాలయం..
బయట గొడవ జరుగుతున్నా గవర్నర్ ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. భరతమాత చిత్రపటం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదు" అని రాజ్ భవన్ వర్గాలు ది ఫెడరల్తో అన్నారు. మలయాళ కవి, హిందూత్వ రాజకీయాల చరిత్రకారుడు పిఎన్ గోపీకృష్ణన్ ది ఫెడరల్తో మాట్లాడుతూ.. “భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత మొదటి క్యాబినెట్ మంత్రివర్గ సభ్యులకు గాంధీ ఒక సందేశం ఇచ్చారు. ‘మన దేశానికి ప్రాతినిధ్యం వహించేది పేద వ్యక్తి ముఖమే. భారతదేశాన్ని అక్కడి నుంచే ముందుకు తీసుకెళ్లాలి. భారత మాత అనే కల్పిత భావంతో కాదు.' అని పేర్కొ్న్నారు.